Thursday, August 29, 2024

నుదుట కుంకుమబొట్టు మదినిల్పు తొలిమెట్టు. మెట్టుకొనుడు మంచి బొట్టు మీరు... సమర్పణ మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

జైశ్రీరామ్

 తిలక ధారణ 

బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటారు పెద్దలు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము,

ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు..

రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు.

కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి...అని పెద్దలు చెబుతూ ఉంటారు.

ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా బొట్టు పెట్టుకుంటే లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు కూడా ఉంటాడు.

కుంకుమ ఎఱుపు రంగు. రంగులలో ఎఱుపునకు అత్యంత ప్రాధాన్యత. ఎఱుపు కరుణకు (దయ) గుర్తు. శక్తిని సూచిస్తుంది. అరుణాం కరుణాం....... అమ్మవారి ధ్యాన శ్లోకం. అలాగే .అమ్మ వారికి కుంకుమ రాగ శోణే అనే ప్రార్ధన ఉంది కదా..

స్త్రీలు కుంకుమ ధరిచడం వేద కాలము నాటి ఆచారం. పురాణతనమైనది..

వివాహిత స్త్రీ పాపిట (రెండుగా విభజించిన తల కేశములు మొదలు ) నుదిటి మధ్య  కుంకుమ ధరించుట సంప్రదాయం గా వస్తున్న పరంపర.

స్త్రీకి నుదిటి కుంకుమ ఒక శోభను ,నిండుతనమును కలుగచేస్తుంది.

మహిళలకు పెళ్లయింది అని గుర్తుకోసం పాపిట బొట్టు పెట్టుకోవడం, పక్క పాపిడి కాకుండా మధ్య పాపిడి తీసుకోవడం, పరికిణీ కాకుండా చీర కట్టుకొని ముఖాన పెద్దగా ఎర్ర బొట్టు పెట్టుకోవడం, మెడలో నల్లపూసలు , మంగళ సూత్రాలు వేసుకోవడం, కాలికి మట్టెలు పెట్టుకోడం చేస్తారు. . కనీసం అవన్నీ చూసి అయినా, పరాయి మగవారు ఈవిడకి పెళ్లయింది ఈవిడ జోలికి పోవద్దు అనుకుంటారు . ఇవన్నీ చాలా పాత ఆచారాలు. స్త్రీలని అందరూ గౌరవంగా చూడాలనే ఉద్దేశ్యంతో పెట్టిన ఆచారాలు. పాతకాలం నించీ ఇప్పటికీ ఇవన్నీ ఆచరించే వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ని గుర్తులు ఉన్నా ఎగబడే కీచకులు రావణాసురులు ఉన్నారు . మగవారికి పెళ్లయింది అని గుర్తుగా ఏమీ లేనప్పుడు మాకు మాత్రం ఎందుకు ఇవన్నీ? అని వీటిని వ్యతిరేకించే మహిళలు కూడా ఉన్నారు.  

పూజాదికాలలో, వివాహ శుభకార్యాలలో ఏ శుభకార్యాలలోనైనా కుంకుమ ధరించడం సంప్రదాయంగా వస్తోంది. తిలకధారణ జీవితంలో సుఖశాంతలు, శుభాలు కలిగిస్తుంది. నుదుట బొట్టు లేకుండా చేసే దానం, స్నానం, హోమం, పుణ్యకార్యాల, తపస్సు అయినా గాని నిష్ఫలము అవుతాయి. మన దేహంలోని ప్రతి ఒక్క శరీర అవయవానికి ఒక్కొక్క అధిదేవతలు ఉన్నారు.

ఇంచు మించుగా చాలామంది భౄమధ్యంలో లేక కాస్త పైన బొట్టు పెట్టుకుంటారు .స్త్రీలు మాత్రమే కాదు పురుషులూకూడా.

ఎందుకూ అంటే అక్కడ ఆఙ్ఞా చక్రం ఉంటుంది . అక్కడే ధ్యానం చేసేటప్పుడు దృష్టి పెట్టాలని చెబుతారు అలా చేస్తే మంచి ప్రశాంతత లభిస్తుంది .

ఏముంటుంది ఆఙ్ఞాచక్రం మీద ?

నమ్మకం ఏమిటంటే సహస్రారంలో మహా కామేశ్వరాంక స్థిత యైన జగజ్జనని ఉంటుంది .వారిపాదాలు ఆఙ్ఞా చక్రం లో ఉంటాయి

బొట్టు పెట్టుకుంటే ఆ శ్రీమాతకు కుంకుమార్చన చేసినట్లే కదా .

అసలు ఆభావన లో ధ్యానం చేస్తూ ఉంటే ఎంత ఆనందతన్మయత్వం కలుగుతుంది.ఆ ఆనందతన్మయత్వంలో కన్నీరు వస్తుంది.

 కళ్ళలో నీళ్ళు ఏంటి ఎందుకొచ్చాయీ .ఓహో గంగమ్మ పుట్టింటికొచ్చిందా ఆవిడ నా కళ్ళ లోంచి బయటకొచ్చిందా

ఇలా మధుర మధురభావాల పుట్టినిల్లు ఆ బొట్టు కదా

ఉదయిస్తున్న భాను బింబం చూస్తే జగన్మాత నుదిటి సింధూరం లా ఉండదూ .పరుచుకున్న ఎరుపు కాంతులు అందరినీ బొట్టు పెట్టుకోమని చెప్పడం లేదూ

స్పందించే మనసుంటె అన్నీ అనుభూతులౌతాయి

బొట్టు పెట్టుకున్న ముఖం ఎంత కళగా ఉంటుంది.

జైహింద్.

Monday, August 26, 2024

గురువాయురప్ప .. గురువాయూరు.

జైశ్రీరామ్. 

గురువాయూరు.

గురువాయూరు కేరళలోని పవిత్రమైన విష్ణుక్షేత్రం. ఇది త్రిసూర్ జిల్లాలోని పట్టణం మరియు పురపలకసంఘం. దక్షిణ ద్వారకగా పిలవబడే ఈ క్షేత్రంలో శ్రీకృష్ణుడు 'గురువాయూరప్పన్' అనే పేరుతో కొలవబడుతున్నాడు. నాలుగు చేతులలో పాంచజన్య శంఖం, సుదర్శన చక్రం, కౌమోదకం, పద్మాలయాలను ధరించి.. తులసి మాలలతో, ముగ్ధ మనోహర రూపంతో అలరించే బాలగోపాలుడి ఆలయం "గురువాయూర్". కేరళలోని త్రిసూర్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయంలోని స్వామిని కన్నన్, ఉన్నికృష్ణన్ (బాలకృష్ణుడు), ఉనికన్నన్, గురువాయురప్పన్ అనే పేర్లతో కొలుస్తుంటారుశ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు.

పాతాళశిల!

ఐదువేల సంవత్సరాలక్రితం నాటిదిగా చెప్పే ఆలయ గర్భగుడిలోని నారాయణ విగ్రహం పౌరాణిక ప్రాశస్త్యమైనది. ఈ విగ్రహాన్ని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురూ ఆరాధించారని పురాణేతిహాసాలు చెబుతున్నాయి. పాతాళశిలతో తయారైన ఈ విగ్రహాన్ని మొదట శివుడు బ్రహ్మకు ఇచ్చాడనీ ఆయన దాన్ని సంతానంకోసం తపిస్తోన్న సూతపాశరుషికి ప్రసాదించాడనీ ఆయన నుంచి వారసత్వంగా కశ్యప ప్రజాపతి అందుకోగా ఆయన దాన్ని వసుదేవుడికి అనుగ్రహించాడనీ, తండ్రి నుంచి దాన్ని శ్రీకృష్ణుడు అందుకుని ద్వారకలో ప్రతిష్ఠించి పూజించాడనీ పురాణాలు చెబుతున్నాయి. స్వర్గారోహణ సమయంలో కృష్ణుడు తన శిష్యుడైన ఉద్ధవుని పిలిచి 'త్వరలోనే ద్వారక సముద్రంలో మునిగిపోతుందనీ అప్పుడు ఈ విగ్రహం నీళ్లలో తేలుతుందనీ దాన్ని దేవతల గురువైన బృహస్పతికి అందజేయమ'నీ చెప్పాడని పురాణప్రతీతి. ఉద్ధవుని సందేశం ప్రకారం బృహస్పతి- వాయుదేవుడి సహాయంతో కేరళ తీరానికి వచ్చాడట. అక్కడ ఓ కోనేరు సమీపంలో శివుడు తపస్సు చేస్తూ కనిపించి ఆ విగ్రహాన్ని కోనేటి ఒడ్డున ప్రతిష్ఠించమని చెప్పాడట. అదే ఈ విగ్రహ ప్రాశస్త్యం. ఆ కోనేరే నేటి రుద్రతీర్థం. గురువు-వాయువు ఇద్దరూ కలిసి ప్రతిష్ఠించడంవల్లే ఈ ప్రాంతం గురువాయూర్‌గా ప్రసిద్ధిచెందింది. తరవాత శివుడు పార్వతిని తీసుకుని అక్కడ నుంచి సరస్సు అవతలి ఒడ్డుకు వెళ్లిపోయాడనీ అంటారు. అదే ప్రస్తుతం శివాలయం ఉన్న మామ్మియూర్‌. మొదట ఇక్కడ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించగా పాండ్యరాజులు పునర్నిర్మించారనీ, తరవాత భక్తులు ఇచ్చిన విరాళాలతో అభివృద్ధి చేశారనీ చెబుతారు.

నారాయణీయం!

గురువాయురప్ప బాలకృష్ణుడి రూపంలో భక్తులకీ అర్చకులకీ కలల్లో కనిపించి వాళ్ల తప్పొప్పుల్ని విప్పిచెప్పిన వైనం గురించిన గాథలెన్నో. ఆయన గురించి భక్తులూ, పురాణేతిహాసాలూ చెప్పేవన్నీ ఒక ఎత్తు. కవితాత్మకంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ నారాయణ భట్టాతిరి వ్రాసిన నారాయణీయం మరో ఎత్తు. 16వ శతాబ్దంలో జన్మించిన నారాయణ భట్టాతిరి పదహారేళ్లకే వేద శాస్త్రాలు ఔపోసన పట్టాడట. ఇరవై యేడేళ్లకే పక్షవాతం, కీళ్లనొప్పులతో బాధపడ్డాడట. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోవడంతో గురువాయురప్ప పాదాల చెంత చేరాక స్వస్థత చేకూరడంతో మహావిష్ణువు అవతారంగా కృష్ణుణ్ణి స్తుతిస్తూ నారాయణీయం రచించారట.

భక్తులు గురువాయురప్పని కన్నన్‌, ఉన్నికృష్ణన్‌, బాలకృష్ణన్‌... అంటూ పలుపేర్లతో అర్చిస్తారు. ప్రధానపూజారి వేకువజామున 3 గంటలకే పచ్చిమంచినీళ్లు కూడా ముట్టకుండా ఆలయంలోకి ప్రవేశించి నాదస్వరంతో చిన్నికృష్ణుణ్ణి నిద్రలేపుతారు. దీన్నే నిర్మలదర్శనం అంటారు. రోజూ విగ్రహాన్ని పాలు, గులాబీఅత్తరు, కొబ్బరినీళ్లు, గంధాలతో అభిషేకించి, పట్టుపీతాంబరాలూ స్వర్ణాభరణాలతో అలంకరిస్తారు. బియ్యప్పిండి, బెల్లం, నెయ్యితో చేసిన తీపిరొట్టెలు; కొబ్బరి ఉండలు; కొబ్బరిపాలు, బెల్లం, బియ్యంతో చేసిన పాయసం; పాలలో ఉడికించిన పిండిరొట్టెల్ని స్వామికి నైవేద్యంగా పెడతారు. పుత్తడితో చేసిన స్వామి ఉత్సవవిగ్రహాన్ని అంబారీ ఎక్కించి మేళతాళాలతో ప్రహరీలోపల ఆలయం చుట్టూ మూడుసార్లు తిప్పుకొస్తారు. 108 దివ్యదేశాల్లో ఈ ఆలయం లేకపోయినప్పటికీ వేదపద్ధతిలో పూజలు నిర్వహించడంవల్లే వైష్ణవులకు గురువాయూర్‌ పరమపవిత్ర ప్రదేశంగా మారింది.

అన్నప్రాశన

గురువాయురప్ప సన్నిధిలో రోజూ ఎంతోమంది చిన్నారులకు అన్నప్రాశన నిర్వహిస్తారు. ఇలా చేయడంవల్ల భవిష్యత్తులో ఆ పిల్లలకి ఎలాంటి విపత్తూ వాటిల్లదనేది భక్తుల విశ్వాసం. అలాగే స్వామిసమక్షంలో వివాహబంధం ద్వారా ఒక్కటైతే జీవితం ఆనందమయంగా ఉంటుందన్న నమ్మకంతో ప్రముఖుల నుంచి సామాన్యులవరకూ ఇక్కడ పెళ్లిళ్లు చేసుకునేందుకు ఇష్టపడతారు. అందుకే కేరళలో మరే గుడిలో లేనన్ని కల్యాణాలు ఇక్కడ జరుగుతుంటాయి. ఇక్కడ నిత్యం జరిగే మరో వేడుక తులాభారం. తమ బరువుకి సమానంగా అరటిపండ్లు, బెల్లం, కొబ్బరికాయలు, పంచదారల్ని స్వామివారికి నివేదిస్తారు భక్తులు.

గజేంద్ర సేవ!

గజరాజుల ప్రస్తావన లేని గురువాయూర్‌ని వూహించలేం. ముఖ్యంగా స్వామిని సేవించిన పద్మనాభన్‌, కేశవన్‌ల గురించిన గాథలెన్నో. ఎత్తుగా సాధుస్వభావంతో ఉండే పద్మనాభన్‌ జీవించి ఉన్నంతవరకూ స్వామి సేవలోనే గడిపిందట. 1931లో అది చనిపోయినప్పుడు స్వామి నుదుట ఉన్న గంధంబొట్టు రాలిపడిపోయిందట. పద్మనాభన్‌ వారసత్వాన్ని అందిపుచ్చుకుంది కేశవన్‌. అచ్చం దానిలానే స్వామిని సేవించేదట. తిడాంబుని ఎక్కించినంతసేపూ భక్తితో ముందుకాలుని ఎత్తిపెట్టుకునే ఉండేదట. అందుకే దీన్ని గజరాజు అన్న పేరుతో సత్కరించారు. 1976లో ఏకాదశి రోజున ఉదయాన్నే స్వామికి అభిముఖంగా తిరిగి దేహాన్ని చాలించిందట. ఆలయానికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న పున్నత్తూర్‌కోటలోనే దేవస్థానానికి చెందిన ఏనుగులశాల ఉంది. అందులో సుమారు 50 ఏనుగులవరకూ ఉన్నాయి. ఇందులో కేశవన్‌ విగ్రహం కూడా ఉంది. ఇక్కడ జరిగే కుంభం ఉత్సవంలో భాగంగా ఏనుగుల పందాలు జరుగుతాయి. అవి చూసేందుకు జనం భారీసంఖ్యలో తరలివస్తారు

శ్రీకృష్ణ విగ్రహ ప్రతిష్ఠకు ముఖ్య కారకులు గురు - వాయువులు కాబట్టి ఈ ఊరిని 'గురువాయూరు' (గురువు+వాయువు+ఊరు) గా నిర్ణయించారు. శ్రీకృష్ణ దేవుడిని 'గురువాయూరప్పన్' అని భక్తిభావంతో పిలుస్తారు. దక్షిణ భారతంలో 'అప్ప' అనగా తండ్రి అనీ ప్రభువు, దేవుడు అనీ అర్థాలున్నాయి.  

జైహింద్.

Thursday, August 8, 2024

మనం తినే కొన్ని కూరగాయలకు సంస్కృత నామాలు .

ఓం శ్రీమాత్రే నమః. 

మనం తినే కొన్ని కూరగాయలకు సంస్కృత నామాలు .

అవాక్పుష్పీ.... బెండకాయ.

శీతలా.... సొరకాయ.

జంబీరమ్....నిమ్మకాయ.

క్షుద్రశింబి.... గోరుచిక్కుడ.

ఆలుకమ్....బంగాళదుంప.

పలాండు....నీరిల్లి.

ఉర్వారుక....దోసకాయ.

కర్కటీ ....నక్కదోస

కూష్మాండ....గుమ్మడికాయ.

కారవేల్ల....కాకరకాయ.

తృణబిందుక....చేమదుంపలు.

కోశాతకీ.... బీరకాయ.

మూలకమ్....ముల్లంగి.

బృహతీ.... ముళ్ళవంకాయ.

రంభాశలాటు....పచ్చి అరటికాయ.

మరిచకా....మిరపకాయలు.

సూరణ....కంద.

రాజకోశతకీ....బెంగళూరువంకాయ....కాప్సికం.

లశునః....వెల్లుల్లి.

వార్తాకః....వంకాయ.

బింబమ్....దొండకాయ.

సతీనకమ్....అలచందలు

జైహింద్.

Monday, August 5, 2024

మహాభారతములో ఈ తొమ్మిది పాత్రలలో గ్రహింపవలసిన జీవిత సత్యాలు..

జైశ్రీరామ్. 

తొమ్మిది పాత్రలలో మహాభారత సారాంశం.

1 మీ పిల్లల అంతులేని వాంఛలు, గొంతెమ్మ కోరికలు తీర్చుకుంటూ పోతే 

కాలక్రమేణా వారు అదుపు తప్పి, మీ ఆధీనంలోంచి దూరం అవుతారు.

వారి ఆధీనంలో కి మీరు వెళ్తారు.

ఉదా. కౌరవులు.

2. నువ్వు ఎంత బలవంతుడు అయినా,ఎంత శక్తివంతమైన 

ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ..ఎన్నో నైపుణ్యాలు కలిగినప్పటికీ.. 

వాటిని అధర్మం కోసం వినియోగిస్తే..అవి నిరుపయోగమవుతాయి.

ఉదా. కర్ణుడు

3 యోగ్యత తెలుసుకోకుండా పుత్ర వాత్సల్యం తో అనర్హునికి అపారమైన 

జ్ఞానాన్ని అందిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. అశ్వత్థామ.


 4. పాత్ర తెలుసుకోకుండా విచక్షణా రహితంగా హామీలు ఇస్తే వారికి జీవితాంతం 

లోబడి బానిస గా చేతులు ముడుచుకొని శక్తిసామర్థ్యాలు ఉన్నప్పటికీ నిర్వీర్యుడై 

బ్రతకవలసి వస్తుంది.

ఉదా. భీష్ముడు.

5.సంపద, శక్తి, అధికారం మరియు తనను బలపరిచే వారి సమస్తము  

దురహంకారం తో అధర్మం గా వినియోగిస్తే వినాశం జరుగుతుంది.

ఉదా. దుర్యోధనుడు

6.స్వార్ధపరుడు, రాగద్వేషాలు గలవాడు,గర్విష్టి, జ్ఞానం కలిగిన వాడు అయినా 

తనవారి పట్ల వల్లమాలిన అభిమానం గల అంధునికి రాజ్యాధికారం ఇస్తే 

వినాశం జరుగుతుంది.

ఉదా. ధృతరాష్ట్రుడు

7. తెలివితేటలకి ధర్మం, సుజ్ఞానం తోడైతే విజయం తప్పక లభిస్తుంది.

ఉదా. అర్జునుడు.

8. మోసం, కపటం, జిత్తులమారి ఆలోచనలు అన్ని వేళలా చెల్లవు. 

ఉదా. శకుని

9. నీవు నైతిక విలువలు పాటిస్తూ, సక్రమ మార్గంలో ప్రయాణం చేస్తూ 

నీ ధర్మం నువ్వు చేస్తూ ఉంటే ఏ శక్తీ నీకు హానిచేయదు.

ఉదా. యుధిష్ఠిరుడు.

జైహింద్.

శ్రీ ధూళిపాళ హరికృష్ణ భాగవతార్ Dhulipala HariKatha special guest sri chaganti koteswara Rao garu