Sunday, December 11, 2011

విశాఖ జిల్ల చోడవరంలో గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు సభ.

నవంబర్2011 నవంబరులో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలలో చోడవరం MLA రాజు గారు ఉపన్యసిస్తున్న దృశ్యం.
నవంబర్2011 నవంబరులో జరిగిన గ్రంథాలయ వారోత్సవాలలో అనేక పోటీలలో విజేతలకు బహుమతి ప్రదానము చేయుచున్న దృశ్యం.
జైశ్రీరాం.
జైహింద్.

Saturday, September 3, 2011

గురువంటే ఇలాగుండాలి(పెద్దల అభిప్రాయాలు)

ఆర్యులారా!
ఉపాధ్యాయ దినోత్సవం వస్తున్న సందర్భంగా అనేకమంది అనుభవజ్ఞులయిన కవి పండితులు గురు శిష్యుల విషయంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను పద్య, గద్య రూపంలో ప్రకటించారు. గురువులు తమ మూర్తిమత్వానికి మెఱుగులు దిద్దుకోడానికి అవశ్యాచరణీయ యోగ్యమైన భావనలను వీరంతా వెలువరించారనడంలో సందేహం లేదు.
వాటిని చూద్దాం. 
పండిత నేమాని అన్నారు...
గురు శబ్దంబునకే యుదాహరణమై కూర్మిన్ ప్రకాశించుచున్,
సరసోత్సేకమయాంతరంగుడగుచున్ ఛాత్రాళికిన్ దైవమై
కర మొప్పారుచు, సాధు బోధనములన్ గావించుచున్, జ్ఞాన భా
స్కర బృందంబులుగా నొనర్చు గురు సంస్కారంబు నెన్నందగున్! 
వీరు గురువు అనే పదానికి చాలా అద్భుతమైన నిర్వచనాన్ని తప పద్యం ద్వారా వివరించడం సహృదయులైన గురువుల అదృష్టంగా భావిస్తున్నాను.
వీరే నన్ను ఉద్దేశించి మరొక పద్యం కూడా వ్రాసి నన్ను ఆశిర్వదించారు. అదీ ఇక్కడ చూద్దాము.   
అయ్యా!
గురులన్ మించిన విద్వదుత్తముడవై కొండంత లక్ష్యంబుతో
పరితోషంబున శిష్యకోటిని కళాపారీణులన్ జేసి భా
సుర యోగంబుల నొంది ఛాత్రులలరన్ శుద్ధాంతరంగమ్ములో
పరితృప్తింగని యొప్పు నీ సుగుణ శోభాదీప్తి వర్ధిల్లుతన్!
పండిత నేమాని రామ జోగి సన్యాసిరావు అవధాని వర్యుల అవ్యాజానురాగానికి పొంగిపోతూ వారికి  ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. 
మందాకిని గారు తమ అభిప్రాయాన్ని చక్కగా మన"కందం"గా వివరించారు. చూడండి.
గురువుల నుపదేశింపగ
గురువుల కేఁదగును.వారిఁ గొలువగఁ, దనపై
కరుణాదృక్కులఁ గొనుమని
దరిజేర వలయును. శిష్య ధర్మంబిదియే.
గురు ధర్మాన్ని నిర్వచింప తనకు అర్హత లేదని, శిష్యధర్మాన్ని చక్కగా వివరించారు మందాకిని గారు. ఓహో! ఎంతటి విధేయత!
చదువులు నేర్పుచు,శిష్యులు
ముదముగ నున్నత గతులును,మోక్షపు దారుల్
వెదకెడి పరిణతి నిత్తురు.
సదయులు గురువుల నుతింప శక్యమె మనకున్?
అని వ్రాసి తమ హృదయాన్ని ఆవిష్కరించారు.
తానే గురువైతే ఏం చేస్తారో అన్న విషయాన్ని వివరించడం ద్వారా గురువుకు నిర్వచనం చెపారు మందాకిని గారు.అదీ చూదండి.
ఆర్తిగ నేను నేర్పెదను, హాయిగ భీతులనెల్లవీడుచున్
నేర్తురు, పిల్లలందరిట నిత్యము నిష్ఠగ మక్కువెక్కువై
కీర్తులు కోరనెప్పుడును కీరపుఁ బల్కుల చిన్నవాండ్రకు
న్పూర్తిగ, నాశతీరగనుఁ, బొందుదు నేనిక నాత్మతృప్తినే.
కారుణమూర్తియై జనుల గౌరవభావనకాలవాలమై
ధీరగుణంబులన్ సరళ దృష్టినిఁ గల్గి సదానుకూలుఁడై
మారని శ్రద్ధతో గురువు మానక బోధలఁ పాఠనమ్ములన్ 
చేరిన శిష్యులందుఁదగు శీలగుణమ్ములఁ బెంచగాదగున్.
నిజంగా ఎంతటి ఔన్నత్యం తొణికిసలాడుతోందో చూచారా మందాకిని గారి అభిప్రాయంలో?
ఇంత చక్కటి వివరణ నిచ్చిన మందాకిని గారికి ధన్యవాదాలు తెలియ జేసుకొంటున్నాను.
రాఘవ అన్నారు...
సిద్ధం సత్సంప్రదాయే స్థిరధియమనఘం శ్రోత్రియం బ్రహ్మనిష్ఠం
సత్త్వస్థం సత్యవాచం సమయనియతయా సాధువృత్త్యా సమేతమ్,
దమ్భాసూయాదిముఖ్యం జితవిషయగణం దీర్ఘబన్ధుం దయాళుం
స్ఖాలిత్యే శాసితారం స్వపరహితపరం దేశికం భూష్ణురీప్సేత్.
-- శ్రీశ్రీశ్రీ వేదాంతదేశికాచార్యులవారు

మన రాఘవ దేశికులకు ఉండవలసిన లక్షణాలను  శ్రీశ్రీశ్రీవేదాంత దేశికాచార్యులవారు చెప్పిన నిర్వచనాన్ని మనకందించారు.
ఎంత చక్కని నిర్వచనమిది!
దేశికులు(గురువులు) సత్సంప్రదాయసిద్ధి కలవారై ఉండాలి. సుస్థిర జ్ఞానులై యుండాలి. పాపరహితులై ఉండాలి. శ్రోత్రియులై ఉండాలి. సత్వము కలవాడై ఉండాలి. సత్యవాకై ఉండాలి. సమయ పాలకుఁడై ఉండాలి. సాధు ప్రవృత్తి కలవాఁడై ఉండాలి. దంభము, అసూయ మున్నగు వాటిని జయించినవాడై ఉండాలి. దీర్ఘ బంధువై ఉండాలి. దయాళువై ఉండాలి. స్వ పర హితుఁడై ఉండాలి.
ఒక ఉపాధ్యాయుఁడు గురువు అవాలి అంటే ఇన్ని సల్లక్షణాలూ ఉండి తీరవలసిందే. అట్టి గురువును శిష్యులు నిరతమూ ఆరాధించ వలసిందే. ఎంతటి చక్కని నిర్వచనము! 
ఇంతటి చక్కని శ్లోకాన్ని అందించిన చిరంజీవి ఆపరమాత్మ కృపామృతాన్ని గ్రోలుతూ ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.
గోలి హనుమచ్ఛాస్త్రి అన్నారు...
గురువు బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుని కన్న
మించి నట్టి వాడు; మంచి నెపుడు
నేర్పి యాచరించి నిష్ఠతో లోకాన
నిలువ వలయు, వెలుగు నీయ వలయు.
గురువనఁబడే వ్యక్తి త్రి మూర్తులకన్న నధికుఁడని, ఎప్పుడూ మంచినే తా నాచరిస్తూ, మంచినే నేర్పుతూ, నిష్ఠా గరిష్ఠుడై లోకంలో స్థిరుఁడవాలనీ, లోకానికి వెలుగు నీయాలనీ మన ప్రియ మిత్రులు శ్రీ గోలి హనుమచ్ఛాస్త్రిగారు చిన్న ఆటవెలది పద్యంలో అనంతమైన భావాన్ని పొందుపరచి, వివరించారు.  
అల్పాక్షరములలో అనల్పార్థ రచన చేయగలిగేవాఁడే కవి అని మన ఆలంకారికుల వివరణ.
ఆ లెక్కన మన హనుమచ్ఛాస్త్రిగారు మన ముందున్న చక్కని కవి అనడంలో సందేహం లేదు. వారికి పరమాత్మతోడు ఎప్పుడూ ఉండాలని ఆశిస్తున్నాను.
మిస్సన్న అన్నారు...
విద్యార్థులను స్వంత బిడ్డలుగా నెంచి - బంగరు భవితకు బాట వేయు. 
మాతృ భాషను నేర్వ మమతను రగిలించి - అన్యభాషాసక్తి నాదరించు.
నీతిని, సఛ్ఛీల నిరతిని బోధించి - యుత్తమ పౌరులౌ యునికి తెలుపు. 
ఋజు మార్గ వర్తియై రేబవల్, బోధించు - మార్గాన చనియెడు మనికిఁ గలుగు.
అన్య ప్రవృత్తుల ననుసరింపక తన - వృత్తికి బద్ధుడై వెలయు చుండు. 
విద్య పరమార్థమును దెల్పి విశదముగను
భావి భారత పౌరుల పాలి దైవ 
సదృశుడై యొప్పు గురువెగా సద్గురువగు? 
కాని నాడా గురువు కొఱగాని బరువు. 
మన మిస్సన్న గారు కూడా గురువుకు ఉండవలసిన గురుతర బాధ్యతలను చక్కగా వివరించారు. అలా లేని నాడు అతఁడు గురువు కాదని, భూమికి బరువనీ నిష్కర్షగా చెప్పారు. కొంచెం నిష్టూరంగా ఉన్నా వీరి మాటలు యదార్థం.
మిస్సన్నగారికి ఆ పరమాత్మ అనుకూలుఁడై ఉండాలని ఆశిస్తున్నాను. 
శ్రీపతిశాస్త్రి అన్నారు...
శ్రీగురుభ్యోనమ:
మహానుభావులు శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారికి సుమాంజలుల నర్పిస్తూ,ఆ మహనీయుని జయంతి సందర్భముగా నేటి ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులందరకు శుభాకంక్షలు తెలియజేస్తున్నాను.
గురువై దేశపు పరువై
గురుతర బాధ్యతలనెపుడు గుర్తించుచు తాన్
పరవశమున పాఠములను
మురిపింపగజెప్పునట్టి మూర్తికి జేజే
బడినే గుడిగా దలచుచు
బడి పిల్లలె బిడ్డలనుచు వాత్సల్యముతో
బుడతల నడతలు దిద్దగ
నడుగిడు యొజ్జలకు భక్తి నంజలులిడుదున్.

శ్రీపతి శాస్త్రి గారు గురువును గురువు కాదు అతఁడు దేశము యొక్క పరువు అని చెప్పడంలోనే ఉంది గురువుకుండే బాధ్యత ఎంతటి మహత్తరమైనదోనన్న విషయం.అట్టి ఉపాధ్యాయులకు జేజేలుకొట్టారు మన కవి. అంతే కాదు. బడి పిల్లలకు మనస్పూర్తిగా విద్యాబోధన చేసే గురువులకు జేజేలు కొట్టుతున్నారు మన కవి. 
చాలా చక్కని గౌరవాన్ని ఇచ్చారు గురువులకు మన శాస్త్రి గారు.
వారికి నా అభినందనలను తెలియ చేసున్నాను.
గన్నవరపు నరసింహ మూర్తి చెప్పారు.
గురువుల యెడ భక్తి భావము మాకుంటుంది అని చెబితే మా ఊరిలో గురువులు ( టీచర్లు ) చాలా ఆశ్చర్యపోతారు.ఇక్కడ అంతా ఉద్యోగ ధర్మము,వ్యాపారమే గాని విశేష భావాలకు తావు లేదు. చక్కని గురువులు నాకు లభించారు. నేను అదృష్టవంతుడినే !
స్థిరమగు జ్ఞానసంపదలు శిష్యుల కిత్తురు పూని శ్రద్ధతో
గురుతర బాధ్యతల్ గొనుచు కోమలహృద్యులు దివ్యసద్గురుల్   
వరమది సద్గురుల్ గలుగ, వారిని గొల్చెడి శిష్యపాళియున్. 
పరమ పవిత్ర బంధ మిది, ప్రాకట మయ్యెగ పూజ్యభూమిలో !       
డా.గన్నవరపు నరసింహ మూర్తి గారు దివ్యమైన సద్గురువులు ఏమి చేస్తారో చెప్పడం ద్వారా ఏమి చెయ్యాలో చెప్పారు తమ పద్యం ద్వారా. భారతావనిపై గురు శిష్య పవిత్ర బంధాన్ని అద్భుతంగా వివరించారు.
వారి మనోహర భావనా సంపత్తిని అభినందిస్తున్నాను. 
ఇంకా ఇంకా అనేకమంది  తమ హృదయంలో గురువుకు గల అసాధారణమైన స్థానాన్ని గూర్చి, గుధర్మం వ్షయంలో తమ అభిప్రాయాలను ఎంతో చక్కగా వివరించి వ్రాసారు. అందరికీ నా కైమోడ్పులు.
గురుస్థానంలో ఉండి ప్రశంసింపఁ బడుతున్న ప్రతీ ఒక్క గురువుకూ నా హృదయ పూర్వక అభినందనలు, కైమోడ్పులు.
రేపే కదా గురు పూజా దినోత్సవము. శిష్య ప్రశిష్యాళిచే సద్గురువులందరూ పశంసింపఁబడి పూజింపఁ బడుదురు గాక. 
జైశ్రీరాం.
జైహింద్. 

Friday, September 2, 2011

గురు దేవో భవ అని పూజింపబడటానికి గురువు ఎలాగుండాలంటారు?(నవ భారత నిర్మాణంలో గురువు పాత్ర.)

ఆర్యులారా! సెప్టెంబరు ఐదవ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం.
ఆచార్య దేవో భవ! అని అందరిచే ఆచార్యుఁడు గౌరవింప బడుతున్నాడు.
మన సమాజం ఎనలేని గౌరవాన్ని ప్రప్రథమంగా తల్లికి, పిదప తండ్రికి, ఆతరువాత గురువుకి ఇస్తోంది. ఇది చాలా సముచితం. ఎందు చేతనంటే విద్యార్థులకు జ్ఞాన జ్యోతులను తన మాటద్వారా, తమ అకళంక సత్ప్రవర్తన ద్వార్వా విద్యార్థులను తీర్చి దిద్దేదీ, జీవన మార్గాన్ని నిర్దేశించేదీ గురువే. అట్టి గురువు తల్లిదండ్రులతో పాటు గౌరవింపబడ వలసిందే.
ఈ సందర్భంగామీ అభిప్రాయాలను కూడా సమాజానికి పంచాలని అభిప్రాయపడుతున్నాను.
అట్టి అసాధారణ గౌరవం పొందడానికి ఆచార్యులు కలిగి ఉండ వలసిన అర్హతలను, అచార్యుని బాధ్యతలను వివరిస్తూ మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా పద్యాల రూపంలో గాని, వచన రూపంలో గాని వివరించండి. ఆచార్యులు అకళంక మూర్తులుగా వెలుగొందే మార్గం సూచించండి. 
ఇందు నిమిత్తము నేను మీకు ముందుగానే కృతజ్ఞతలు తెలుపుకొనుచున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Monday, August 22, 2011

జన్మాష్టమి శుభాకాంక్షలు.


మీ అందరికీ నా శుభాశీస్సులు.
గీతా మాహాత్మ్యము
ధరోవాచ:
భగవాన్! పరమేశాన! భక్తిరవ్యభిచారిణీ!|
ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హేప్రభో || 1 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధుల
కే రకముగ భక్తి యబ్బు నీశ్వర! యనుచున్
చేరి ధర హరిని యడుగగ
నారాయణుఁ డిట్లు చెప్పె నమ్మిక మీరన్.
భూదేవి విష్ణుభగవానుని గూర్చి ఇట్లు ప్రశ్నించెను. ఓ భగవానుడా! పరమేశ్వరా! ప్రభూ! ప్రారబ్ధము అనుభవించే వానికి అచంచలమైన భక్తి ఎట్లు కలుగగలదు?

శ్రీవిష్ణురువాచ:
ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతస్సదా |
స ముక్త స్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే || 2 ||
కః- ప్రారబ్ధ కర్మ బద్ధులు
తీరికగా గీత చదివి తృప్తిగ నాపై
భారము వేసిన, కర్మలు
వారల కంటవు. విముక్తి ప్రాప్తించు ధరా!
ఓ భూదేవీ! ప్రారబ్ధము అనుభవిస్తున్ననూ ఎవరు నిరంతరము గీతాభ్యాసమందు నిరతుడై ఉండునో అట్టివాడు ముక్తుడై కర్మలచే అంటబడక ఈ ప్రపంచమునందు సుఖముగా ఉండును.

మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ |
క్వచిత్ స్పర్శం న కుర్వంతి నలినీదళమంభసా || 3 ||
కః- గీతా ధ్యానము చేయు పు
నీతుల కఘమంట బోదు. నీరముఁ గన నే
రీతిని  తామర కంటునె?
యాతీరుగ  నిదియు, తెలియ నద్భుతమిదియే.
తామరాకును నీరంటనట్లు గీతాధ్యానము చేయు వానిని మహాపాపములు కూడా కొంచమైనను అంటవు.

గీతాయాః పుస్తకం యత్ర యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వై || 4 ||
కః- గీతా గ్రంథ మదెచ్చట,
గీతా పఠనంబదెచట కీర్తి ప్రదమై
భూతలమందున నుండునొ
యా తలమున పుణ్య తీర్థ మమరిక నుండున్.
ఎచ్చట గీతా గ్రంధము ఉండునో మరియు ఎచ్చట గీతా పారాయణము జరుగుచుండునో అచ్చట ప్రయాగ మొదలగు సమస్త తీర్ధములు ఉండును.

సర్వే దేవాశ్చ ఋషయో యోగినః పన్నగాశ్చ యే |
గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః
సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే || 5 ||
గీః- ఎచట గీతపారాయణ మెలమి జరుగు
నచట దేవతల్, ఋషివరు లఖిల యోగు
లఖిల నాగులు గోపిక లఖిల గోప
కులును నార దోద్ధవులు కొలుపు మేలు.
ఎచ్చట గీతాపారాయణము జరుగుచుండునో అచటికి దేవతలు, ఋషులు, యోగులు, నాగులు, గోపికలు, గోపాలురు భగవత్స్పర్శ్యాస్యాసక్తులగు నారద, ఉద్ధవాదులు వచ్చి శీఘ్రముగా సహాయమొనర్తురు.

యత్ర గీతా విచారశ్చ పఠనం పాఠనం శ్రుతం |
తత్రాహం నిశ్చితం పృథ్వి నివసామి సదైవ హి || 6 ||
గీః- గీత పఠన పాఠన , శ్రావ్య కృతి విచార
మెచట జరుగుచు నుండునో యచట నేను
నిష్టతో నుండి కాతును నేర్పు మీర. 
గమ్య మార్గము  చూపుదు. కనుమ! పృథ్వి!
ఓ భూదేవీ! ఎచట గీతను గూర్చి విచారణ, పఠనము, భోధన, శ్రవణము జరుగుచుండునో అచట నేను ఎల్లప్పుడు తప్పక నివసింతును.

గీతాశ్రయేహం తిష్ఠామి గీతా మే చోత్తమం గృహమ్ |
గీతాజ్ఞానముపాశ్రిత్య త్రీన్ లోకాన్ పాలయామ్యహమ్ || 7 ||
ఆః- గీత నాశ్రయించి క్రీడింతు జగమున.
గీతయే గృహముగ ప్రీతి నుందు.
గీత నాశ్రయించి ఖ్యాతి ముజ్జగముల
నేలు చుంటి నేను మేలుగాను.
నేను గీతనాశ్రయించి ఉన్నాను, గీతయే నాకు ఉత్తమగు నివాస మందిరము మరియు గీతాజ్ఞానమును ఆశ్రయించియే మూడు లోకాలను నేను పాలించుచున్నాను.

గీతా మే పరమా విద్యా బ్రహ్మరూపా న సంశయః |
అర్ధమాత్రాక్షరా నిత్యా స్వనిర్వాచ్య పదాత్మికా || 8 ||
గీః- గీతయే నా పరమ విద్య. ఖ్యాతిఁ గనిన
గీత బ్రహ్మస్వరూపము. కీర్తి ప్రదము.
ప్రణవమందున నాల్గవ పాదమైన
అర్థ మాత్ర నిత్య సు శాశ్వితానుపమము.
గీత నాయొక్క పరమవిద్య అది బ్రహ్మస్వరూపము దీనిలో సందేహము లేదు, మరియు అది ప్రణవములో నాలగవ పాదమగు అర్ధమాత్రా స్వరూపము, నిత్యమైనది, నాశరహితమైనది, అనిర్వచనీయమైనది.

చిదానందేన కృష్ణేన ప్రోక్తా స్వముఖతోర్జునమ్ |
వేదత్రయీ పరానందతత్త్వార్ధజ్ఞానమంజసా || 9 ||
గీః- కృష్ణుఁ డర్జునునకుఁ జెప్పె గీత  కృపను 
మూడు వేదాల సారము. మూడు లోక
ములకు నానందప్రదమిది. కలుగ జేయు
తత్వ విజ్ఞానమును తనన్ దలచినంత.
సచ్చిదానంద స్వరూపుడగు శ్రీ కృష్ణ పరమాత్మచే స్వయముగా అర్జుననుకు ఉపదేశింప బడినది. ఇది మూడు వేదముల సారము, పరమానందమయినది, తన్నాశ్రయించిన వారికి శీఘ్రముగా తత్వజ్ఞానాన్ని కలుగచేయును.

యోష్టాదశ జపేన్నిత్యం నరో నిశ్చలమానసః |
జ్ఞానసిద్ధిం స లభతే తతో యాతి పరం పదమ్ || 10 ||
గీః- ప్రీతి నష్టా దశాధ్యాయ ఖ్యాతి నెఱిగి,
పఠన చేయు నా నరుఁడు తా బ్రహ్మ పథము
నొందు. సందేహమే లేదు. మంద మతియు
దీనిని పఠించి మోక్షంబు తాను పొందు. 
ఏ నరుడు నిత్యమూ గీతయందలి పద్దెనిమిది అధ్యాయములను పఠించునో అతడు జ్ఞానసిద్ధిని పొంది తద్వారా పరమ పదమును (మోక్షమును) పొందును.

పాఠే సమర్థస్సంపూర్ణే తదర్థం పాఠమాచరేత్ |
తదా గోదానజం పుణ్యం లభతే నాత్ర సంశయః || 11 ||
గీః- శక్తి హీనులు గీతను భక్తి తోడ
సగము చదివిన చాలును సత్ ఫలమిడు.
గంగి గోదాన ఫలమిచ్చు గాన  చదివి
సత్ ఫలంబును గాంతురు సహృదయు లిల.
గీతని మొత్తము పఠించలేని వారు అందులో సగమైనను పఠించవలెను దీనివలన అతడికి గోదాన ఫలము వలన కలుగు పుణ్యము లభించుననుటలో సందేహము లేదు.

త్రిభాగం పఠమానస్తు గంగాస్నానఫలం లభేత్ |
షడంశం జపమానస్తు సోమయాగఫలం లభేత్ || 12 ||
గీః- గీత మూడవ వంతైన ప్రీతి తోడ
చదువ స్వర్గంగ స్నాన ఫలదము. నిజము.
గీతనారవ భాగము ప్రీతిఁ జదువ
సోమ యాగ ఫలంబిచ్చు. శుభము లొసగు.
గీతయొక్క మూడవభాగము(ఆరు అధ్యాయములు) పఠించినవానికి గంగా స్నాన ఫలము లభించును, ఆరవ భాగము(మూడు అధ్యాయములు)పఠించువారికి సోమయాగ ఫలము లభించును.

ఏకాద్యాయం తు యో నిత్యం పఠతే భక్తిసంయుతః |
రుద్రలోకమవాప్నోతి గణోభూత్వా వసేచ్చిరమ్ || 13 ||
గీః- ఒక్క అధ్యాయమైనను నిక్కముగను
గీత ప్రతిదినంబు చదువఁ బ్రీతి తోడ
రుద్ర లోకము పొంది తా రుద్ర గణము
నందు నొకడగు.నివసించు నందనిశము.
ఎవడు గీతయొక్క ఒక అధ్యాయము భక్తితో పఠించునో అతడు రుద్రలోకమును పొంది రుద్ర గణములలో ఒకడుగా శాశ్వతముగా నివసించును.

అధ్యాయశ్లోకపాదం వా నిత్యం యః పఠతే నరః |
స యాతి నరతాం యావన్మనుకాలం వసుంధరే! || 14 ||
గీః- నిత్య మధ్యాయ పాదము నేర్పు మీర
చదువ నుత్కృష్ట నర జన్మ చక్క నొదవు
సరిగ మన్వంతరము . కాన చదువ వలయు
భక్తి తోడను గీత. సద్భక్తు లెల్ల.
ఓ భూదేవీ ఎవరు గీతనందలి ఒక అధ్యాయమునందలి నాల్గవ భాగమును నిత్యమూ పఠించునో అతడు ఉత్కృష్టమైన మానవ జన్మ ఒక మన్వంతర కాలము పొందును.

గీతాయాః శ్లోకదశకం సప్త పంచ చతుష్టయమ్ |
ద్వౌత్రీనేకం తదర్ధం వా శ్లోకానాం యః పఠేన్నరః || 15 ||
చంద్రలోకమవాప్నోతి వర్షాణామయుతం ధ్రువమ్ |
గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషతాం వ్రజేత్ || 16 ||
గీత పది, ఏడయిదు నాల్గు ప్రీతి తోడ
మూడు, రెండొకటందర్థము చదివినను
నింద్ర లోకమున పదివేలేండ్లుబ్రతుకు.
గీత చదువుచు మరణింప కీర్తిఁ గొలుపు
మనుజ జన్మము నొందును మానవుండు.
ఎవరు గీతనందలి పది శ్లోకములను కానీ, ఏడుశ్లోకములను కానీ, ఐదు శ్లోకములను కానీ, నాలుగు శ్లోకములను కానీ, మూడు శ్లోకములను కానీ, రెండు శ్లోకములను కానీ, ఒక శ్లోకమును కానీ, అర్ధ శ్లోకమును కానీ నిత్యము ఏవరు పటింతురో,౧౫.
వారు ఇంద్రలోకములో పదివేల సంవత్సరములు సుఖముగా జీవించుననుటలో సందేహము లేదు మరియు గీతను పఠిస్తూ ఎవరు మరణిస్తారో అతడు ఉత్తమ మగు మానవ జన్మను పొందుట నిశ్చయము.౧౬

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమాం |
గీతేత్యుచ్చారసంయుక్తో మ్రియమాణో గతిం లభేత్ || 17 ||
గీః- అట్లు మానవుఁడై పుట్టి యనుపమగతి
గీత పఠియించి సన్ముక్తి నాతఁడు గొను.
గీత గీతయనుచు ప్రాణ మాతఁడు విడ
సద్గతిని పొందు నప్పు డసంశయముగ.
అట్లాతడు మానవుడై జన్మించి గీతాభ్యాసమును మరల మరల గావించి ఉత్తమమగు మోక్షమును పొందుననుటలో సంశయము లేదు. గీతా గీతా అనుచు ప్రాణమును వదలువాడు సత్గతిని పొందుననుటలో సందేహము లేదు.

గీతార్థశ్రవణాసక్తో మహాపాపయుతోపి వా |
వైకుంఠం సమవాప్నోతి విష్ణునా సహ మోదతే || 18 ||
క:- గీతార్థము వినఁ గోరెడి 
పాతకుఁడును ముక్తి పొంది పరమాత్మునితో
ప్రీతిగ నొందును సుగతిని.
ఖ్యాతిగ పఠియింప గీత యమరుడతఁడగున్. 
మహా పాపాత్ముడైనను అతడు గీతార్ధమును తెలుసుకొనుటలో ఆసక్తుడైనచో అతడు విష్ణు లోకమును పొంది శ్రీమహా విష్ణు సన్నిధిలో ఆనందమును అనుభవించుచూ ఉండును.

గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః |
జీవన్ముక్త స్స విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్ || 19 ||
క:- గీతార్థ చింతనంబున
నాతండగు కర్మదూరుఁడాతనికబ్భున్
ఖ్యాతిగ జీవన్ముక్తియు.
భాతిగ నొడఁగూడు పరమ పథమతనికిలన్.
ఎవడు గీతార్ధమును నిత్యము చింతన చేయుచుండునో అతడు అనేక కర్మల నాచరించిననూ జీవన్ముక్తుడేనని చెప్పబడెను, మరియు దేహ పతనానంతరము పరమ పదమును(కైవల్యమును) పొందును.

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః |
నిర్ధూతకల్మషా లోకే గీతా యాతాః పరమం పదమ్ || 20 ||
ఆ:- సాక్షులరయ మనకు జనకాది రాజులీ
లోకమందనుపమ శ్రీకరమగు 
గీతనాశ్రయించి పాతక దూరులై
ముక్తి నొందినారు పూజ్యముగను.
ఈ ప్రపంచమున గీతను ఆశ్రయించి జనకాది రాజులు అనేకులు పాపరహితులై ముక్తిని పొందియున్నారు.

గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్ |
వృథాపాఠో భవేత్ తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః || 21 ||
క:- గీతా పఠనము చేసియు
గీతా పఠన ఫలమున్నొకింతచదువమిన్
గీతాపఠనము వ్యర్థం
బేతత్ఫల శూన్యులగుదు రెఱుగుడు దీనిన్.
గీతని పఠించి పిదప మహత్యమును ఎవరు పఠించకుందురో అట్టి వారి గీతా పఠనము వ్యర్ధమే(నిష్ఫలమే). అట్టివారి గీతాపఠనము శ్రమ మాత్రమేనని చెప్ప బడినది.

ఏతన్మాహాత్మ్యసంయుక్తం గీతాభ్యాసం కరోతి యః |
స తత్ఫలమవాప్నోతి దుర్లభాం గతిమాప్నుయాత్ || 22 ||
గీ:- గీత మాహాత్మ్యము చదివి, గీత చదువు
సజ్జనులు పొందుదురు తాముసత్ఫలములు
పైన చెప్పిన ఫలములు ప్రాప్తమగును.
దుర్లభంబగు సద్గతి దొరకు నిజము.
గీతా మహత్యముతో గీతా పారాయణము చేయువారు పైన చెప్పబడిన ఫలములను పొంది, దుర్లభమగు సద్గతిని పొందుతురు.

సూత ఉవాచ:
మాహాత్మ్యమేతద్గీతాయా మయా ప్రోక్తం సనాతనమ్ |
గీతాంతే చ పఠేద్యస్తు యదుక్తం తత్ఫలం లభేత్ || 23 ||
గీ:- శౌనకాదిమహాఋషి సౌమ్యులార!
అతి సనాతన గీతా మహత్యమేను
తెలిపితిని. గీత పఠియించి దీని నెవరు
చదువు గీతా ఫలము వారు సరగున గను.
సూతుడు చెప్పెను.
శౌనకాది ఋషులారా! ఈ ప్రకారనముగా సనాతనమైన గీతా మహత్యమును మీకు తెలుపుచున్నాను. దీనిని గీతా పారాయణానంతరము ఎవరు పఠింతురో అతడు పైన చెప్పిన ఫలమును పొందును.
ఓం ఇతి శ్రీవరాహపురాణే గీతామాహాత్మ్యం సంపూర్ణమ్.
ఇట్లు వరాహ పురాణమునందలి గీతా మహత్యము సమాప్తము.
జై శ్రీకృష్ణ.
జైహింద్.

Monday, July 4, 2011

చెప్పుకోండి చూద్దాం. ( గూఢోత్తరము అనే పద్య రచనా ప్రక్రియ )

సాహితీ ప్రియులారా!
ఈ క్రింది శ్లోకములో గల ప్రశ్నకు సమాధానం చెప్ప గలరా?
స సర్వ బుధ గీర్మాన్యః  పరారిర్భృత్య రాజ్యదః.
మాయీమేశం కం సు శబ్దం రక్షణం సువ్రతో జగౌ?
సమాధానం మీరు చెప్ప గలరని నాకు తెలుసు.

ఒక వేళ చెప్పలేమని అనిపిస్తే  శ్లోకారంభం నుండి బేసి అక్షరాలన్నిటినీ కలిపి చూడండి. మీరు చెప్ప వలసిన సమాధానం లభిస్తుంది.
బాగుందా? మీ అభిప్రాయం వ్యక్తం చేసే హక్కుతో పాటు, చక్కని సూచనలనివ్వ వలసిన బాధ్యత కూడా మీపై ఉందని మరువకండి. మీ దృష్టిలో గల ఇటువంటి చమత్కార భరిత పద్యాలను ఆంధ్రామృతం ద్వారా పాఠకులకందించడం కోసం వ్యాఖ్య ద్వారా పంపంపండి. ధన్యవాదములు.
జై శ్రీరాం.
జైహింద్.

Thursday, June 16, 2011

మద్రాసులో గల ఘంటసాల వారి ఇంటికి ష్ష్తి పూర్తి.



త్యాగరాజు నగర్ మద్రాస్ లో నూతన గృహమును నిర్మించిన గానగంధర్వుడు శ్రీ ఘంటసాల వేంకటేశ్వర రావు గారు 21-4-1951 వ తేదీన  ఆ గృహ ప్రవేశం చేసారు. ఆ గృహానికి షష్తి పూర్తయింది.
ఇప్పడా గృహం ఏ స్తితిలో ఉందో యేమో!
వారి వారసులే అందు నివసిస్తూ ఉంటే మాత్రం వారికి ఆంధ్రామృతం అభినందనలు తెలియ జేస్తోంది.
జై శ్రీరాం.
జైహింద్. 

Saturday, May 7, 2011

మాతృ దేవో భవ. మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.


సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్మదో
మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.

తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్ 
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.


తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?


మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?


తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలు మార్లు.
తల్లి కన్న గొప్పదైన దేది ?


మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.

వేసవి శిక్షణా శిబిరాల ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలౌతున్న చిరంజీవులు.

వేసవి శిక్షణా శిబిరము(సమ్మర్ కేంపు)లద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను మన చిరంజీవులకు వివిధ కళలలో శిక్షణను ఇవ్వడం,ఇప్పించడం ద్వారా వారిలో మనో వికాసం, తద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించ వచ్చు. చక్కని భావి భారత పౌరులుగా తీర్చి దిద్ద వచ్చు.
వివిధ సాంఘిక సంక్షేమ సంస్థలు వేసవి తాపానికి మూలకు చేరకుండా, వేసవి తాపాన్ని మరిపిస్తూ, పిల్లకూ, పెద్దలకు కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, తద్వారా భారతీయ అపురూప సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళలలో శిక్షణ నిప్పించడం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. 
ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మహానుభావులనేకమంది ఉన్నారు. వారందరికీ నేను హృదయ పూర్వకంగా అభినందిస్తూ, అంజలిస్తున్నాను.
పిల్లలు నిరుపయోగమైన టీవీ సీరియల్స్ కు అతుక్కు పోయే ప్రమాదం ఈ సమ్మర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్టి ప్రమాదం నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తప్పక ఇటువంటి వేసవి శిక్ష్ణా శిబిరము(సమ్మర్ కేంపు)లలో చేరేందుకు తమ పిల్లలను ఉత్సాహ పరచాలి. 
దయ చేసి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వార్థ చింతనలకు స్వస్తి పలకాలి. తమ పిల్లలు భావి భారత పౌరులు. బాధ్యతా యుతమైన పౌరులుగా మీ పిల్లలు సిద్ధమవాలంటే అది తల్లిదండ్రుల, సామాజికుల, ఉపాధ్యాయుల, తోటి బాలుర క్రమశిక్షణపైన ఆధార పడి ఉంటుంది.మనయొక్క క్రమశిక్షణ, మనము  పిల్లలకు నేర్పుతున్న క్రమ శిక్షణ పైనా ఆధారపడి ఉంటుంది.
ముందు మీరు ఏహ్యమైన టీవీ సీరియల్స్ కు తప్పక   దూరంగా ఉండి, పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తారు కదూ?
నా మాట మన్నిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. మీ పిల్లలు ఆదర్శవంతమై భావి భారత పౌరులుగా తయారయి, మీకు, మీ కుటుంబానికి, వారుంటున్న సమాజానికి, మాతృ దేశానికీ తప్పక మంచి పేరు తేవాలని ఆశిస్తూ, నా ఆశలు పండాలని కోరుకొంటున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Wednesday, April 20, 2011

PSLV 16 ప్రయోగం విజయవంతమైనందుకు అభినందనలు.


శ్రీకరమైన మన భారత మాత ముద్దు బిడ్డలైన శాస్త్ర వేత్తల అకుంఠిత దీక్షా ఫలితంగా సిద్ధమైన అంతరిక్షనౌక PSLV16 యావత్ భారతీయుల హృదయాలను రంజింప చేస్తూ అత్యద్భుతంగా నిరాటంకంగా గగన తలంలో ప్రయాణించి, తన గమ్యాన్ని చేరుకొంటూ మూడు ఉపగ్రహాలను తమ కక్ష్యలలోకి చేర్చి, శాస్త్రజ్ఞులను యావద్భార జాతినీ ఆనంద పారవశ్యంలో ముంచిందంటే అది మన శాస్త్రవేత్తల నైపుణ్యానికీ, దేశ భక్తిభావానికీ నిదర్శనం.
ఇస్రో చైర్మన్ శ్రీ రాధా కృష్ణన్ గారిని, వారి సూచనలను పొల్లువోవకుండా అనుసరిస్తూ, తమ జ్ఞాన నైపుణ్యాలను జోడించి,ఐక్యతతో పనిచేసి,ఈ విజయానికి కారకులైన, భారతాంబకు ముద్దుబిడ్డలైన శాస్త్రవేత్తలను, ప్రత్యక్షంగాను, పరోక్షంగాను సహాయ సహకారాలందించిన ప్రతీ ఒక్కరినీ మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.
ఈ సందర్భంగా మన ప్రియతమ భారత రాష్ట్రపతికీ, కేంద్ర రాష్ట్ర పభుత్వాలకు, మహోన్నత భావ ప్రపూర్ణులైన యావద్భారతీయులకు నాహృదయ పూర్వక అభినందనలు తెలియ జేస్తున్నాను.
మన శాస్త్రీయ పురోగతి ప్రపంచాన్నే ఆశ్చర్యపరచేలా దినదినాభి వృద్ధి చెందుతూ, యావత్సృష్టికీ మంగళప్రదంగా అకుంఠితంగా కొనసాగేలా చేయాలని ఆ పరమాత్మను మనసారా ప్రార్థిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Wednesday, April 13, 2011

శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీగురుచరణారవిందాభ్యాంనమోనమః.

శ్రీ మంగళంపల్లిని తన చూపులతో మంగళప్రదునిగా చేస్తున్న శ్రీశేషశాయి
శ్రీరస్తు.                         శుభమస్తు.                    అవిఘ్నమస్తు.
శ్రీమాన్ మానాప్రగడ శేషశాయి శ్రీ గురు చరణములకు
మీ శిష్య పరమాణువు చింతా రామ కృష్ణా రావు
భక్తి పారవశ్యముతో చేయుచున్న
పాదాభివందనములు.

శా:- శ్రీనాధాది కవుల్ ధరా తలమునన్ శ్రీ శేషశాయే యనన్
మానాప్రగ్గడ శేష శాయి గురుసమ్మాన్యా! కృపన్ గల్గిరే!
జ్ఞానాంభోధి ప్రసన్నభాస్కర! మహా జ్ఞానామృతాంశల్ సదా
ప్రాణంబై ప్రణవంబునౌచు వెలయన్ భాగ్యంబుగాఁ గొల్పిరే!

చ:- గురువర! మీ మహాద్భుత సుగోచర మయ్యెడి జ్ఞాన దీప్తి మా
వరగుణ వృద్ధి కారణము. భాగ్య నిధానము. భవ్య బోధయున్.
సరి యెవరయ్య మీకిలను సద్గుణ గణ్యులలోన నెన్నగా.
కరములు మోడ్చి మ్రొక్కెదను గౌరవమొప్పగ, జ్ఞాన భాస్కరా!

చ:- మధుర వచస్వి! మీ మృదుల మంజుల గాత్ర విశేషమేమొ! మా
యెదలును పల్లవించినవి. ఏమని చెప్పుదు మీదు ప్రేమ! వా
ఙ్నిధి లభియించె మాకు. మహనీయుల దర్శన భాగ్యమబ్బె. మీ
సదమల దివ్య మానసము సారథియై నడిపించె మమ్ములన్.

కంద గీత గర్భ చంపక మాల:-
వర మధుస్రావమై, అమృత వారిధియై, శుభమై రహించు శ్రీ
చరణ నుతిన్ సదా సకల సత్పరివర్తనఁ జక్క జేయుచున్,
పర సుధనంబు గా కవిత పార, ధరన్ నను గౌరవించ్రి. ప్రాక్
సరస కవీ! సదా తమరి సన్నుత దీవన తప్పదెందునన్!

చంపక గర్భస్థ గీతము:-
అమృత వారిధియై, శుభమై రహించు
సకల సత్పరివర్తనఁ జక్క జేయు
కవిత పార, ధరన్ నను గౌరవించ్రి.
తమరి సన్నుత దీవన తప్పదెందు.

చంపక గర్భస్థ కందము:-
మధుస్రావమై, అమృత వా
రిధియై, శుభమై రహించు శ్రీచరణ నుతిన్
సుధనంబుగా కవిత పా
ర, ధరన్ నను గౌరవించ్రి, ప్రాక్ సరస కవీ!

శ్రీ చక్ర బంధ తేటగీతి:-
వరద పాండిత్య! శ్రీ యుత! వాఙ్నిధాన!
లక్ష్య వరదుఁడ! శ్రీ కర! లక్షణాది
సిద్ధిఁ గొలిపితే! శ్రీ వరసిద్ధి రామ
వరలఁ జేసితి నన్నంది వామ దేవ!

చ"తురంగ"గతి బంధ కందము:- ( గురువరు - వదనము - భవభయ హరణము )
సునిశిత పదముల తగు వివ
రణముగ గురువుల శరణు నర వరులు మహతిన్
కనవలె నుయభ సుఫలదము
లనవరతము నయము శుభము లది యిడును తగన్. 


నక్షత్ర బంధ కందము:- ( సుజనవర - శేషశయన )
సుధ నభిషవ వశ వర! జ్ఞా
న ధనా! నయ బోధనను తనర కొలుపన్ శే
షి ధిషణ! భూమిజ దేవ! వి
శదమయ సుకవివర గణన. జన శేఖరుఁడా!

చ:- శుభమగు గాక దివ్య పరిశోభిత మూర్తికి జ్ఞాన దీప్తికిన్,
శుభమగు గాక పూజ్య రవి శోభలు గాంచిన పుణ్య మూర్తికిన్,
శుభమగు గాక శిష్య గణ శోభిత సద్గురు భవ్య కీర్తికిన్, 
శుభమగు గాక పుణ్య పరిశోభిత సత్కవి శేష శాయికిన్.
  
మంగళం                                                                   మహత్
శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
ఇట్లు,
మీ శిష్య పరమాణువు
చింతా రామ కృష్ణా రావు.
హైదరాబాదు.
తేదీ.౧౪ - ౦౪ - ౨౦౧౧.
http://andhraamrutham.blogspot.com
సెల్.నెంబరు:- 9247238537.

Friday, April 8, 2011

ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా! మేల్కోండి.

ఓ భారతీయ ఆదర్శ యువతీ యువకులారా!  మేల్కోండి. 
మంచి సమయం ఆసన్నమైంది. 
అవినీతి భరతం పట్ట గల జన లోక్ పాల్ బిల్లు కొఱకై అలుపెఱుగని పోరాటం చేస్తున్న అపర గాంధీ మన అన్నా హజారే చేస్తున్న నిజమైన సత్యాగ్రహాన్ని మనసారా అభినందించండి. 
మీ నిష్కళంకమైన హృదయ పూర్వకమైన మద్దత్తును తెలియ జేయండి. 
నేను సహితం అంటూ ఈ ఉద్యమంలో భాగస్వాములై ముందడుగు వేయండి. 
అలుపెఱుగని పోరాటానికి మీరూ శక్తినివ్వండి. 
భావి భారత పౌరులలో నీతి బీజాలు నాటే నైతికమార్గదర్శులవండి. 
ఎన్నాళ్ళని ఈ దురంతదౌష్ట్యాలను మీలో మీరే తిట్టుకొంటూ, ఏమీ చేయలేని అసహాయులులాగా జీవచ్ఛవాలలాగా జీవించాలని మీరు కోరుకొంటున్నారు? 
వద్దు. పిరికితనం మీకు వద్దు. 
యావద్భారత దేశంలోను అవినీతి రాబందులు సంఖ్యకంటే 
వారి అవినీతి కారణంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో బాధా సర్ప దష్టుల సంఖ్యే ఎక్కువ అన్న మాట మరువకండి. 
అంతా ఒక్కటైతే అవినీతిని రూపు మాప గలిగే జన లోక్ పాల్ బిల్లు తేవటం చాలా సులభమన్న విషయం మరువకండి. 
అన్నా హజారే అకుంఠిత దీక్షనొక్కమారు మనసారా తిలకించండి. 
అకళంక లోక కల్యాణకరమైన  హజారే దీక్షకు కారణం అతని ప్రగాఢ ఆత్మ విశ్వాసమే కదా! మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరూ సాఘిక సంస్కరణకుద్యుక్తులయేవారికి తోడ్పడండి.
మీదే విశాల భారతం, మీకే సొంతం, మీదే ఈ విశాల స్వతత్ర్య స్వేచ్ఛా సామ్రాజ్యం, సమైక్యతతో నడప గలిగే మీకే దేశ క్షేమం కూర్చడం సాధ్యమౌతుంది. 
విజయోస్తు.
అన్నాహజారే సహృదయతను మీరూ అలవరచుకొన గలిగితే మీరుద్యమించిన నాడు స్వార్థపూరితులకు , వారి రాజకీయ జీవనానికీ నూకలు చెల్లక మానవు.
అన్నా హజారే సత్యాగ్రహ ఫలంగా  అన్నా హజారే కోరిన విధంగా జన లోక్ పాల్ బిల్లు అతి త్వరలో నెలకొల్పబడునని మనసారా ఆశిస్తున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.

Friday, March 25, 2011

చంద్ర గణములు, వాటిని కలిగి యుండు పద్యముల లక్షణములు.


సరస్వతీ! నమస్తుభ్యం.
సరస సాహిత్య సౌందర్యోపాసకులారా! అనేక మంది పాఠకులు చంద్ర గణములను, అవి ప్రయోగింప బడిన పద్యములను గూర్చి తెలుసుకొనఁ గోరిరి.
నే నెఱిగిన వాటిని ఆంధ్రామృతం ద్వారా అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది.
ఇంకా వివరంగా కాని, సవరణలు గాని తెలియ జేయ గోరు వారు. తమ అమూల్యమైన వ్యాఖ్యల ద్వారా పంప గలందులకు మనవి.
ఇక చూడండి.
చంద్ర గణములు:-
UIUU = రగ
I I IUU = నగగ
UUIU = తగ
I I U IU = సలగ
U I I U = భగ
I I  I IU =నలగ
UUUI = మల
I I UU I = సగల
U I U I = రల
I I  I U I =నగల
U U I I = తల
I I  U I I = సలల
U  I I  I = భల
I I  I I  I = నలల
చంద్ర గణములను కలిగి యుండే కొన్ని  పద్యముల వివరణ.
మహాక్కర:- 
౧ సూ.౫ ఇం. ౧ చం. యతి: 
ద్వితీయ చతుర్థ గణములు ఇంద్ర గణములకు బదులు సూర్య గణములైనను ఉండ వచ్చును.
ఐదవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
సీత హృదయాబ్జ భృంగమా! శ్రీరామ!క్షితిజుల వెతలను తీర్చవయ్య!
మధురాక్కర:- 
౧ సూ. ౩ ఇం. ౧ చం. యతి: ౪ వ గణము మొదటి అక్షరము.
నాల్గవ గణము మొదటి అక్షరము యతి స్థానము.
ప్రాస ప్రాస నియమము కలదు.
ఉదా:-
రామ శ్రీరామ సీతాభిరామ! మ మ్మరయుమయ్య!
అంతరాక్కర:- 
౧ సూ. ౨ ఇం. ౧ చం. యతి: ౩ వ గణము చివరి అక్షరము.
మూడవ గణము తుది వర్ణము యతి స్థానము. కవి జనాశ్రయము, కావ్యాలంకార చూడామణులను బట్టి చూచినచో ౪ వ గణము మొదటి అక్షరము యతిస్థానముగా తెలియును. 
ప్రాస నియమము కలదు.
ఉదా:-
రాము కనుగొంటి సుందరారామమందు
అల్పాక్కర:- 
౨ ఇం. ౧ చం. 
౩ వ గణము మొదట యతి యుండును.
ప్రాస నియమము కలదు.
ఉదా:-
శ్రీరామ చంద్రుఁడు క్షేమ మిచ్చు.
షట్పదము:- 
౬ ఇంద్ర గణములు + ౧ చంద్రగణము = ౭ గణముల లోను 
౧, ౨ ఇంద్రగణములు మొదటి పాదమునందును,
౩,౪, ఇంద్రగణములు రెండవ పాదమునందును,
౫, ౬, ఇంద్ర గణములు, ౧ చంద్రగణము మూడవ పాదమునందును వచ్చును, అట్టివి మూడు + మూడు =  పాదములు మొత్తం ఆరు పాదములు షట్ పదముగా ఒప్పిదమై యుండును.
౬పాదములందు అమరి యుండునది అగుటచే ఇది షట్ పదమనబడును.
యతి ఉండదు.
ప్రాస నియమమున్నది.
ఉదా:-
శ్రీ రామ! జయరామ!
ధీరాత్మ! నీ ప్రేమ
ధారాళముగ గొన్నధన్య సీత!
కారుణ్య మును జూపి
నీరూప మును జూపి,
కోరిన ముక్తిని కొలుపుమయ్య!
జై శ్రీరామ్.
జైహింద్.