Saturday, May 7, 2011

మాతృ దేవో భవ. మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.


సుమధుర భావనామృత సుశోభిత మాతృ హృదంతమ్మదో
మమతల మందిరమ్ము, తరమా పరమాత్మకునైననిట్టి త్యా
గమయ ప్రజానురంజనము? గౌరవ కల్పక కల్పకమ్మదే.
సమరస భావ శోభితము. సంతత సంతతి యోగ దాయి తాన్.

తల్లిని మించు నట్టి పర దైవము లేదిల సృష్టి నెందు. రా
గిల్లుచు, ముద్దు పెట్టుకొను, క్షేమము కోరును. దైవ సన్నిధిన్ 
జల్లగ కావుమంచు మనసార పదింబది మ్రొక్కు చుండు. నా
తల్లి పదాబ్జముల్ శిరము తాకి నుతింతును భక్తియుక్తునై.


తల్లి పాలు త్రాగి తనువును పెంచిన
ధర్మవృత్తి నున్న తనయుడెపుడు
తల్లి ఋణము తీర్చ తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?


మల్లె మరిమళమ్ము, మహనీయ కస్తూరి,
ఘనత కన్న యట్టి కప్పురమ్ము
తల్లి ఘనతఁ బోల తహ తహ పడునయ్య!
తల్లి కన్న గొప్పదైన దేది ?


తల్లి దండ్రి లేని దైవంబు భూమిపై
తల్లి ప్రేమ గ్రోల తనయుఁడగుచు
పుట్టు చుండె కాదె పొంగుచు పలు మార్లు.
తల్లి కన్న గొప్పదైన దేది ?


మా అమ్మగారు దైవాంశ సంభూతురాలైన చింతా వేంకట రత్నం పాదారవిందములకు ప్రణమిల్లుతూ,
దైవాంశ విరాజితులైన పుడమిఁ గల మాతృ మూర్తులందరికీ శిరసు వంచి పాదభివందనం చేస్తున్నాను.
మాతృ దేవోభవ.
జై శ్రీరాం.
జై హింద్.

వేసవి శిక్షణా శిబిరాల ద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలౌతున్న చిరంజీవులు.

వేసవి శిక్షణా శిబిరము(సమ్మర్ కేంపు)లద్వారా మన సంస్కృతీ సంప్రదాయాలను మన చిరంజీవులకు వివిధ కళలలో శిక్షణను ఇవ్వడం,ఇప్పించడం ద్వారా వారిలో మనో వికాసం, తద్వారా ఆత్మ విశ్వాసం పెంపొందించ వచ్చు. చక్కని భావి భారత పౌరులుగా తీర్చి దిద్ద వచ్చు.
వివిధ సాంఘిక సంక్షేమ సంస్థలు వేసవి తాపానికి మూలకు చేరకుండా, వేసవి తాపాన్ని మరిపిస్తూ, పిల్లకూ, పెద్దలకు కూడా వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహిస్తూ, తద్వారా భారతీయ అపురూప సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే కళలలో శిక్షణ నిప్పించడం చేస్తే బహుళ ప్రయోజనకరంగా ఉంటుంది. 
ఇప్పటికే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన మహానుభావులనేకమంది ఉన్నారు. వారందరికీ నేను హృదయ పూర్వకంగా అభినందిస్తూ, అంజలిస్తున్నాను.
పిల్లలు నిరుపయోగమైన టీవీ సీరియల్స్ కు అతుక్కు పోయే ప్రమాదం ఈ సమ్మర్ లో చాలా ఎక్కువగా ఉంటుంది.
అట్టి ప్రమాదం నుండి తమ పిల్లలను కాపాడుకోవడానికి తల్లిదండ్రులు తప్పక ఇటువంటి వేసవి శిక్ష్ణా శిబిరము(సమ్మర్ కేంపు)లలో చేరేందుకు తమ పిల్లలను ఉత్సాహ పరచాలి. 
దయ చేసి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కొన్ని స్వార్థ చింతనలకు స్వస్తి పలకాలి. తమ పిల్లలు భావి భారత పౌరులు. బాధ్యతా యుతమైన పౌరులుగా మీ పిల్లలు సిద్ధమవాలంటే అది తల్లిదండ్రుల, సామాజికుల, ఉపాధ్యాయుల, తోటి బాలుర క్రమశిక్షణపైన ఆధార పడి ఉంటుంది.మనయొక్క క్రమశిక్షణ, మనము  పిల్లలకు నేర్పుతున్న క్రమ శిక్షణ పైనా ఆధారపడి ఉంటుంది.
ముందు మీరు ఏహ్యమైన టీవీ సీరియల్స్ కు తప్పక   దూరంగా ఉండి, పిల్లలను సక్రమ మార్గంలో నడిపిస్తారు కదూ?
నా మాట మన్నిస్తున్నందుకు మీకు నా ధన్యవాదములు. మీ పిల్లలు ఆదర్శవంతమై భావి భారత పౌరులుగా తయారయి, మీకు, మీ కుటుంబానికి, వారుంటున్న సమాజానికి, మాతృ దేశానికీ తప్పక మంచి పేరు తేవాలని ఆశిస్తూ, నా ఆశలు పండాలని కోరుకొంటున్నాను.
జైశ్రీరాం.
జైహింద్.